ఆర్టీసీకి రూ.500 కోట్ల బోనస్?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అనగానే అప్పులు, నష్టాలే గుర్తుకొస్తాయి.. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. క్రమంగా ఆర్టీసీ గాడిన పడుతోంది. 20 రోజుల్లో చోటు చేసుకున్న పెనుమార్పులు బోనస్పై ఆశలు రేకెత్తిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే.. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం బోనస్ రూపంలో ఏకంగా రూ.500 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని విశ్వసనీయ సమాచారం. బడ్జెట్ ద్వారా ఆర్టీసీకి కేటాయించే రూ.వేయి కోట్లలో సగం మొత్తాన్ని బోనస్గా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గరిష్టంగా ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున బోనస్ అందే అవకాశముంది.
మార్చి తర్వాత బ్రేక్ ఈవెన్కు..
వచ్చే మార్చి తర్వాత ఆర్టీసీ బ్రేక్ ఈవెన్ (లాభనష్టాలు లేని సమస్థితి)కు చేరుకుంటుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ఆ తర్వాత మరో నాలుగైదు నెలల్లో హైదరాబాద్లో మినహా మిగతా ప్రాం తాల్లో లాభాలు కనిపించే అవకాశముంది. ఆర్టీసీని పునరుద్ధరించిన తర్వాత స్వయంగా సీఎం కె.చంద్రశేఖర్రావు పర్యవేక్షణలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆయన క్రమం తప్పకుండా అధికారులతో భేటీ అవుతూ పరిస్థితులు తెలుసుకుని సూచనలు, సలహాలు అందిస్తున్నారు. తాను రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ నష్టాలను నివారించి రూ.14 కోట్ల లాభాలు తెచ్చానని స్వయంగా పలు సందర్భాల్లో ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఆర్టీసీని పర్యవేక్షిస్తున్నందున లాభాలను కూడా పునరుద్ధరించే అవకాశముంది. సమ్మె తర్వాత తీసుకున్న కొన్ని చర్యలు ఆర్టీసీ నష్టాలను భారీగా తగ్గించేందుకు దోహదం చేయబోతున్నాయి.